Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

స్వామిపూజా విధానం
శ్రీ జమ్ములమడక మాధవరామశర్మ

ఇదేమిటో లోకానికి అందించాలని ఇది వ్రాస్తున్నాను. శ్రీకామకోటి వైభవాన్ని నేను వర్ణించగలనా? నేను ప్రస్తుతం గుర్తించినంతమాత్రం వర్ణిస్తాను. చాలకాలంనుంచీ ఈ విధంగానే పూజ జరుగుతున్నది. అయినా ఈ నాటిది నవీనము. రేపటిది ఇంకా నవీనము. ఇంకా జరిగేదంతా నిత్య నవీనము అందరూ ఈ వైభవం దర్శంపగలరు. నాకన్న వివేకులు ఇంకా దర్శింపగలరు. వారూ ఈ విధంగానే గుర్తించి వ్రాస్తే అవన్నీ ఒకచోట చేర్చి సంభావించుకోవచ్చు.

గుంటూరు విజయం చేసిన మహాస్వామిపాదులు నియంతగా సర్వకాలములలో పూజచేస్తున్నారు. శ్రీచంద్రమౌళీశ్వర పూజలు చేస్తున్నారు. వారు మహామహస్సును పూజిస్తున్నారు. ఇదంతా మహాభాగ్యం. ఈ మహాభాగ్యం మనకు ప్రత్యక్షమౌతున్నది. పాదపూజ్యులైన మహాస్వామిపూజ్యపాదులు, మహాపూజ నిర్వర్తిస్తూవుంటే, చూస్తూ భావిస్తూ ఉన్న మన మహాభాగ్యమును ఏమని వర్ణించాలి? ఇదంతా మన 'అహోభాగ్యం'!

పూజాసమయానికి కొన్ని వేలమంది స్త్రీలు, పురుషులు వచ్చారు. వచ్చిన వారందరికీ తగిన చల్లని పందిళ్ళ నిర్వహణవీరులు చక్కగా వేయించారు. ఈ పందిళ్లలోకి జనం ఏకభావంతో వచ్చారు. సువాసినీ దేవతలంతా కామాక్షీ దేవతల వలె ఆసీనులయ్యారు. కొందరు లలితాపారాయణం చేస్తున్నారు. కొందరు విష్ణుసహస్రనామపారాయణం చేస్తున్నారు. ఇంకాకొందరు కామాక్షీస్తుతి శ్లోకాలను పఠిస్తున్నారు. చాలమంది శ్రోత్రియులు వేదవిదులు. శాస్త్ర హృదయులు మంత్రచింతకులు, యోగాసక్తులు, బహుశ్రుతులు, అనేకులున్నారు. చిరకాలం క్రిందటి ఆశ్రమాలలోని వైభవం గుర్తుకు వచ్చి తీరాలి.

వీరంతా ఏ ఆశలతో వచ్చారు? ఏమయినా ఆశ##పెట్టితే ఇంతమంది వచ్చి ఈ విధంగా ఉంటారా? వీరంతా ఒక్క ఆశతో వచ్చారు. అది ఆత్మాశ. వీరి అందరి ఆత్మను, మహాస్వామి మహరిగా చూపిస్తున్నారు. కామాక్షీ వల్లభాత్మకమయిన ఆత్మదర్శనానికై వచ్చారు. వచ్చి నేర్చిన వేదవచనాలను పల్కుతున్నారు. తాము చిరకాలంగా చేసిన వేదాధ్యయనానికి మంచిసమయ వినియోగం సంపాదించుకొన్నారు. శాస్త్రవిదులు శాస్త్రలక్ష్యమును భావిస్తున్నారు. యోగులు యోగగమ్మమును గుర్తిస్తున్నారు. కొందరు మౌనంగా అవకాశంగా మూకపంచశతి పారాయణ చేస్తున్నారు. ఆమూలకొందరు రామాయణ పారాయణ పరాయణులై ఉన్నారు. కొందరు చండీ సప్తశతి మంత్రచింతనంతో ఉన్నారు. కొందరు దేవీమంత్రచింతన చైతన్యం అందుకొంటున్నారు. వీరందరికీ తగిన స్థానం లభిస్తుంది. లభిస్తుందేమిటి? లభించింది. చాలమంది ధనవంతులు, ఉద్యోగులు, అధికారులు సభకువచ్చారు. వచ్చినవారందరూ ఈ వేదపండితులకు, శాస్త్ర, జీవనులకు అగ్రస్థానం ఇచ్చి తాము దూరంగా ఉండి ఆనందం అనుభవిస్తున్నారు. తమ జీవితచర్యలలో ఇటువంటి మంచిపని చేయగలిగినామని సంతోషిస్తున్నారు. ఇంతటి విశేషం ఎట్లాకలిగింది. మహాస్వామి సంకల్పాన కలిగింది.

కామాక్షీ దేవి మందిరంలో దీపకాంతులు గోచరిస్తున్నవి. తెరతొలగింది. దీపజ్వాలలు జాజ్వల్యమానంగా ఉన్నవి. విద్యుద్దీపాలు పెట్టితే ఇలాంటి భావపవిత్రత కలుగుతుందా? దేవీమందిరంలో చీకటేలేదు. శ్రీచక్రం ఉన్నది. పూర్ణకలశం ఉన్నది. స్వామిశిష్యులు శివపరివారంలోని ప్రమధులవలె పూజాపరికరములు నన్నిటిని యథా క్రమంగా సమకూరుస్తున్నారు. సభలో కన్యలు గీతాగానం చేస్తున్నారు. 'కామకోటి పీఠాధివాసిని! కామకళాత్మికే! కామాక్షీ!' అంటున్నారు. ఆ గీతాలు దేవి విన్నది. ఒకచిన్ననవ్వు తెల్లగా నవ్వింది.

వేదిక దగ్గర ఉన్న బుట్టలలో తట్టలలో భక్తులందరూ పుష్పాలను, ఫలాలను ఉంచారు- గోక్షీరములు తెచ్చి అర్పించారు. మహాస్వామి ఆగోక్షీరంతో సమంత్రకంగా అభిషేకం చేస్తూ వున్నారు. ప్రతిదినమూ మూడుకడవలపాలైనా ఉండాలి. అని భక్తులకు తెలిసింది. మహాస్వామి పూజకై వస్తున్నారని అచేతనమయిన ఘంటసచేతనంగా మ్రోగింది. యతులుకొందరు అనుసేవనం చేస్తూ దేవీ సన్నిధిలో సంచరించారు. మంత్రదీక్షితులైన పరిచారకులు సమంత్రకంగా పరిచర్యలు చేస్తూ పరికరాలను ఉంచవలసిన చోట ఉంచుతున్నారు. ఈ సమయంలో కొందరు ద్రవిడదేశవనితలు, ఎక్కడనుంచి వచ్చారో, కామాక్షీ దేవతలవలె వచ్చారు. ఆరూపంతో కామాక్షీ వచ్చిందని కొందరయినా అనుకొని ఉండాలి.

బ్రహ్మాండమంతా శ్రీచక్రాకృతి మన హృదయమే శ్రీచక్రం సర్వమూ శ్రీచక్రస్వభావము. ఈ విషయాన్ని కొందరిలో కొందరే గుర్తిస్తారు. భగవత్పాదులు కామకోటి సన్నివేశస్థలాన్ని కూడా శ్రీచక్రాకృతిగా గుర్తించారు. నేనొకసారి శ్రీశైలం వెళ్ళి ఒకస్థలంలో కూర్చుని పారాయణ చేస్తూ అటుగా చూచాను. శ్రీశైలం శిఖరాగ్రాన గాయత్రీ తేజోబ్రహ్మసూర్యభగవానుడు కనిపించగా శ్రీచక్రబిందు పీఠశివభావం భాసించింది. 'శ్రీశైలం శిఖరం దృష్ట్యా' అని అనుకొన్నాను.

శంకరభగవత్పాదులు బిందుపీఠవాసిని శ్రీకామాక్షిదేవిని కంచి కోమకోటిస్థలంలో గుర్తించి గుర్తింపజేశారు. శివుడు ఉగ్రరూపుడు, శాంతరూపుడున్నూ, అదే విధంగా శ్రీకామాక్షి కూడా. ఆ దేవీ ఉగ్రరూపమును, శాంతాత్మకంగా శంకరులు మనకందించారు. మహాస్వామి ఆదేవిని అర్చిస్తున్నారు. ఆ ప్రక్కనే మహాకామకామేశ్వరుడైన శ్రీచంద్రమౌళీశ్వరుడుకూడా యోగలింగ రూపంగా ఉన్నాడు. సభలో ఉన్న వేదవిదులదృష్టి అటు ప్రసరించింది. విద్యారణ్య భాస్కరులూ, అద్వైత సిద్ధిదర్శనులూ వచ్చారు. వేదానువచనం జరుగుతూవుంది. పూజాసంభారాలు తెచ్చి యిస్తున్నారు. దీక్షిత పరిచారకులు అన్నీ సావధానంగా అందిస్తున్నారు. పూజాపీఠం వద్ద సూచనాత్మకంగా ఘంటానాదం వినవచ్చింది. ఆనాదానునాదములు ప్రసరించినవి. అల్లంత దూరమున సన్నాయి రాగాలాపనం వినబడుతున్నది. అనుగుణమైన వాద్యం. శంఖధ్వని, ఘంటానాదం, సభలో ఎవరూ మాట్లాడటం లేదు. ఈ నాదంలో నాదాంతం అందుకొంటున్నారు. ఒక ద్రావిడ కామాక్షి. వేదిక దగ్గర పుష్పమాలికనుంచింది. స్వామి పీఠసన్నిథానంలో పూజాభాజనం కూర్చారు. కొందరు లలితాపారాయణం చేస్తున్నారు. ఆంధ్రకామాక్షులు నిమీలిత నేత్రాలై కామాక్షిని దర్శిస్తున్నాడు.

భిక్షావందనం చేయదలచుకొన్నావారు, తమ పరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చారు. శ్రీచరణులు వచ్చారు. ఒక ప్రక్కగా కూర్చున్నారు. భిక్షావందనం చేస్తే 'నారాయణ' అన్నారు. జనుల ఆనందం కోలాహలంగా వుంది. జనులు స్వామి ప్రభావం కీర్తించు కొంటూ ఉన్నారు. మహాగజం వచ్చింది. నియంతంగా ఫలాలను అందించారు. పిల్లలు, ఆ ఫలాలను ఆస్వాదించడమును సంతోషంగా చూచారు.

శ్రీచరణులు పూజ ఆరంభించారు. ప్రాణాయామం చేస్తున్న ఆమూర్తిని చూడాలి. అది సగర్భప్రాణాయామరీతి. చూపరులకు కనిపించే దేహాన్ని అమృతీకరించేరీతి, కుండలినీ చాలనం చేసేరీతి, దేహమంతా దేవతాత్మకం చేశారు. గోరుతగలకుండా ముక్కు విరగకుండా జాగ్రత్తగా సిద్ధపరచిన అక్షతలతో న్యాసం చేశారు. దండవిన్యాసంతో ఏమోఏమో చేశారు. అది మహాస్వామి ప్రక్రియ నిత్య సన్నిహిత యతులకు తెలుస్తుంది. అక్షతలతో అక్షర న్యాసం చేసి మాతృకా భావనం చేసి, అంతర్ముఖ సమారాధ్య అయిన శ్రీకామాక్షిని సాక్షాత్కరింప చేసుకొన్నారు. వారి రూపంగా మనకున్నూ అదేవి గోచరించింది.

శ్రీదృష్టి ప్రసరంతో శ్రీవారు అనిమేషులై భావిస్తున్నారు. పూర్ణకుంభార్చనం చేశారు. అన్నికళలూ ఆవహింపచేశారు. అదిగో! అక్కడ దక్షిణావర్తశంఖం ఉంది. సమయనియతంగా పాత్రాసాదన చేశారు. అంతటా సంప్రోక్షణంచేశారు. విశ్వమే అపావితమైంది. విఘ్నాపసారణం చేశారు. పీఠదేవతలను అర్చించారు. పరివార దేవతలను అర్చించారు.

ఇక కామాక్షిని ఆరాధించాలి. అదిగో! ప్రాణాయామం చేస్తున్నారు. చిత్కళను ఆవేశింపచేశారు. ప్రతిష్ఠామంత్రాలు పఠించివుంటారు. అమృతీకరణానికి, సకలీకరణానికీ తగినట్లుగా సర్వతీర్థావాహనం చేశారు కదా! సూర్యమండలం నుంచి సర్వతీర్థములను మంత్ర బలంతో అంకుశముద్రతో ఆకరించి, సంపాదించారుకదా! చంద్రమౌళీశ్వరుని అభిషేకం చేస్తున్నారు. అందరు తెచ్చిన గోక్షీరాలకు వినియోగం వచ్చింది.

అవనికాభ్యంతరములో మహాభిషేకం జరుగుతున్నది. సభలో రుద్రానువాకాలు పఠిస్తున్నారు. పయోధారలతో అభిషేకం చేస్తున్నారు. సువర్ణపాత్రలో గోక్షీరంవుంచి ధారాభిషేకం చేస్తున్నారు. శ్రీ చక్రం పై చందనాభిషేకం చేస్తారు. అవనికలో ఇంకా ఇంకా ఆచారనియతములయిన అభిషేకాలు చేస్తారు. అభ్యంతరంలో శివార్చన జరుగుతున్నది. ఇటుగా భగవత్పాద సాదుకార్చన జరుగుతున్నది. అభిషేకం ఐంది 'అభిషేక ప్రియఃశివః' అందరకూ కనబడేటట్లు ఇపుడు పూజచేస్తున్నారు.

అభిషేకం చేసేటపుడు పూజచేసేటపుడు శ్రీవారిని చూడాలి. చూడకలిగి చూడాలి. ఉగ్రశాంతరూప పూజచేశారు. పుష్పవిశేషాలతో పూజచేస్తున్నారు. శ్రీవారు తమ హృదయ కుసుమాలతో పూజిస్తున్నారు. పరాను సంధానంతో వశ్యంతీ నాదం అందుకొంటూ మధ్యమాను సంధానంతో అర్చిస్తున్నారు. సంపూర్ణ నామభావంతో అర్చిస్తున్నారు. జపాకుసుమం చేతపట్టి తెల్లని పుష్పాలూ తెల్లనిపుష్పాలా పట్టి రక్తశుక్ల ప్రభామిశ్రమైన ప్రకాశవిమర్శాత్మక మయిన దేవీ దేవులను ఆరాధించారు. అవనిక వేశారు.

ఇక నైవేద్యం సర్వఫలనివేదనం చేశారు. సాంప్రదాయకంగా సిద్ధపరచిన సమయాచార దక్షిణాచార సమ్మత పదార్థములను నివేదించారు. ఇంత ఏమిటి. అమృతనైవేద్యం అర్పించారు. సాంప్రదాయక ముద్రాప్రదర్శనం చేశారు. సర్వహృదయార్పణం చేశారు. ఈ నైవేద్యసమయంలో నానావాద్యాలు మ్రోగుతున్నవి. కామాక్షి ఆరగిస్తున్నది. చంద్రమౌళీశ్వరుడు ఆస్వాదిస్తున్నాడు. అందరూ సావధానంగా ఉన్నారు. పందిరిపై ఎండవుంది. కానీ చల్లిగాలి వీచింది.

దేవీ దేవుల ఆరగింపుసమయములో దేవతలంతా వీచోపులు వేస్తున్నారు. నివేదనాస్వాదపర్యతం యవనికి ఉంటుంది. అదిగో యవనిక తొలగింది. దీపజ్వాలలు కనిపిస్తున్నవి. మహాదీపం మళ్ళీదీపం ఘంటావాదనంతో స్వామి నవధాదీపం చూపారు. దీప దీపమునకూ దీపం చూపారు, అదేమి? దివ్యగంధం ప్రసరిస్తున్నది. అదే కామాక్షీపూజా పరమార్ధం.

స్వామి ప్రసన్నదృష్టితో చూచి అనుగ్రహించారు. ఈ సమయంలో సానుగ్రహదృష్టికై సాధకులు యత్నించండి. ఛత్రం చామరం అన్నీ సమర్పించారు. విద్యాగోష్టీ నివేదనం చేశారు. సర్వార్పణం చేశారు. శాంత్యుదకం సంప్రోక్షించారు. ఆ ఉదకం మన అందరిపై ప్రసరించినట్లే. ఇదే సాకార్చనం. దండంమయిచే ధరించి స్వామిపాదులు ప్రదక్షిణం చేశారు. ఇటు చూచారు. ఆచూపు మనకు రక్ష- ఆత్మభిక్ష.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page